సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ఫ్రీడం బైక్ ర్యాలీ వేడుకగా సాగింది. ఐటీసీ కోహినూర్ తీగల బ్రిడ్జి నుంచి ప్రారంభమైన రైడ్ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. 400 మంది రైడర్లతో ప్రారంభమైన ర్యాలీ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐటీ కారిడర్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగింది. పోలీసులు, యువతీ, యువకులు ద్విచక్ర వాహనాలపై త్రివర్ణ పతాకాలను చేతపట్టి, భారత్ మాతాకి జై అంటూ దాదాపు 25 కిలోమీటర్ల పాటు నిర్వహించిన ర్యాలీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు చోట్ల ర్యాలీకి యువత గౌరవ వందనం సమర్పించింది. ర్యాలీ సాగుతున్న మార్గాలకు ఇరువైపులా నిలబడిన ప్రజలు త్రివర్ణ పతాకాలతో అభివాదం చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. పలువురు త్రివర్ణ బెలూన్లు గాలిలోకి ఎగురవేశారు.
భారతమాత జయ జయ నాదాలతో ఐటీకారిడార్ మార్మోగింది. ఫ్రీడం ర్యాలీ గచ్చిబౌలి స్టేడియం చేరుకున్న తరువాత సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా త్రివర్ణ పతాకాలను చేతబూని ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని చాటుకోవడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు దేశభక్తిని మరింత పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడం రైడ్లో పాల్గొని తమ దేశభక్తిని చాటిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.
మారేడ్పల్లి, ఆగస్టు 13: వజ్రోత్సవాల్లో భాగంగా నార్త్ జోన్ పరిధిలోని గోపాలపురం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ జెండాను చేతబూని చిలకలగూడ ఎక్స్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు, క్లాక్టవర్, సంగీత్ చౌరస్తా, రైల్నిలయం రోడ్డు మీదుగా సికింద్రాబాద్ ఆర్ఆర్సీ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. షీటీమ్స్ అడిషనల్ డీసీపీ శిరీష, నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, సినీ దర్శకులు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షీటీమ్స్ అడిషనల్ డీసీపీ శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ ఫ్రీడమ్ ర్యాలీ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.