ఎల్బీనగర్, మే 18: అత్యాధునిక వసతులు, 24 గంటల పాటు ఉచిత వైద్య సేవలతో కూడిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కొత్తపేటలోని ఓజోన్ వైద్యశాల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్న వారు.. హోం ఐసొలేషన్లో ఉండే వీలు లేని వారు ఈ కేంద్రంలో చేరి చికిత్స పొందవచ్చు. ప్రైవేట్ వైద్యశాల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తొలి ఐసొలేషన్ కేంద్రం ఇదే కావడం విశేషం.
సరూర్నగర్ సర్కిల్ గడ్డిఅన్నారంలోని అధునాతన భవనంలో 90 పడకలతో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని సమకూర్చగా.. ఓజోన్ వైద్యశాల డాక్టర్లు, నర్సులతో పాటు మందులు, ఉచిత భోజనాన్ని అందించనున్నారు. ఈ కేంద్రంలో ఐదు లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మిషన్ను అందుబాటులో ఉంచారు. అంతేకాక ఓ ఆర్ఎంఓ, ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు, రోగులకు సేవలు చేసేందుకు నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ కేంద్రాన్ని ఉప్పల్, కాప్రా, హయత్నగర్, సరూర్నగర్, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వారు ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 7075948108లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
కొవిడ్తో బాధపడుతూ హోం ఐసొలేషన్లో ఉండలేని వారి కోసం అత్యాధునిక వసతులతో ఉచిత ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గడ్డి అన్నారంలోని అధునాతన భవనంలో ఈ కేంద్రాన్ని నిర్మించాం. కొత్తపేటలోని ఓజోన్ వైద్యశాల సహకారంతో వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఈ సెంటర్ అందుబాటులో ఉంది. -ఉపేందర్రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని గడ్డి అన్నారంలో అధునాతన సౌకర్యాలతో ఉచిత ఐసొలేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చాం. స్వల్ప లక్షణాలు ఉన్న వారు.. ఇంట్లో ఐసొలేషన్లో ఉండలేని వారు ఈ కేంద్రం సేవలు పొందవచ్చు. అన్ని రకాల వైద్య సేవలతో పాటు పోషకాహారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. -దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎంఆర్డీసీ చైర్మన్