మన పథకాలు దేశానికే ఆదర్శం
మనసున్న మారాజు కేసీఆర్కు అండగా నిలవాలి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
రామకృష్ణాపూర్లో 587 మందికి పట్టాలు పంపిణీ
పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్సీ విఠల్,ఎమ్మెల్యే రామన్న, కలెక్టర్ భారతీహోళికేరి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
టీఆర్ఎస్ సర్కారుకు దీవెనలందించిన లబ్ధిదారులు
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలోగల సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ భారతీహోళికేరితో కలిసి 587 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. జీవో నంబర్ 76 తీసుకొచ్చి దశాబ్దాల కల నెరవేర్చిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్, విప్ బాల్క సుమన్కు అండగా నిలవాలని మంత్రి గంగుల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకొని మురిసిపోయిన మహిళలు, టీఆర్ఎస్ సర్కారుకు దీవెనలందించారు.
రామకృష్ణాపూర్లో జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
రామకృష్ణాపూర్, జూన్ 10 : సింగరేణి ఆడ బిడ్డల కండ్లలో ఆనందం చూశామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి 587 మంది లబ్ధిదారులకు (రెండో విడుత) పట్టాలు అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవని, మన పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచే మన మనసున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి,విప్ బాల్క సుమన్కు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీకి శాపంగా మారిందన్నారు. సింగరేణి భూముల క్రమబద్ధీకరణ చేయాలని సమైక్య రాష్ట్రంలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి జీవో నంబర్ 76ను విడుదల చేశారన్నారు. ఈ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని, తమ కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఇక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
రామకృష్ణాపూర్కు పునర్వైభవం తెస్తా : విప్ బాల్క సుమన్
నాడు ఆర్కే 1, 2, 3, 4 గనులు ఉన్న సమయంలో రామకృష్ణాపూర్ ఎలా కళకళలాడిందో ఆ వైభవాన్ని తిరిగి తీసుకువస్తానని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. 60 ఏండ్లలో ఈ ప్రాంత ప్రజలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. 2014లో సింగరేణి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, జీవో నంబర్ 76 తీసుకువచ్చి ఇండ్ల పట్టాల పంపిణీ ప్రారంభించామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 5 వేల మందికిపైగా మహిళలకు పట్టాలు అందుతాయని, వారంతా రూపాయి లేకుండా సొంతింటి యజమానులుగా మారుతారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 3,929 మందికి పట్టాలు అందజేశామని, జీవో 76 కాల పరిమితి పెంచడం వల్ల మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం లభించిందన్నారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న నాలుగు వేల క్వార్టర్లను రెవెన్యూ డిపార్టుమెంటుకు అప్పజెప్పి తద్వారా నామమాత్రపు రుసుముతో పేద ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమని రిజక్ట్ చేసిన ప్రాంతాలతో పాటు ఆర్కే 4 గడ్డ, శాంతినగర్, వల్లభాయి నగర్, నాగార్జున కాలనీ, ప్రగతి కాలనీ, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, రాంనగర్, భగత్ సింగ్ నగర్, గంగాకాలనీ, సూపర్ బజార్ ఏరియా, దుర్గారావు మార్కెట్, గీతా మందిర్ ఏరియాల్లో మిస్సయిన ఇండ్లను తిరిగి చేర్పించామన్నారు.
రూ. 145.83 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పట్టణ సుందరీకరణ, శ్మశాన వాటికలు, లైబ్రరీ, మహిళా భవన్, సమీకృత మార్కెట్, కేసీఆర్ పార్కు, మంచిర్యాల ఎక్స్ రోడ్ నుంచి రామాలయం చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ, డంప్ యార్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పట్టణం మొత్తం విద్యుత్ లైట్లు, బతుకమ్మ గ్రౌండ్లు, కమ్యూనిటీ భవనాలు పూర్తయితే క్యాతనపల్లి మున్సిపాలిటీ గొప్ప పట్టణాలను తలదన్నేలా తయారవుతుందన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కొన్ని పనిలేని, పనికిమాలిన పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే నినాదంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. సింగరేణిలో 16 వేల మందికిపైగా తండ్రుల ఉద్యోగాలు బిడ్డలకు అందేలా చేసింది కేసీఆర్ కృషేనన్నారు. సింగరేణిలోని బొగ్గు బ్లా కులను అమ్మాలని బీజేపీ ప్రభుత్వం చూస్తే ఎదురొడ్డి ఆ బొగ్గు బ్లాకులకు వేలం వేయకుండా అడ్డుకున్నామన్నారు. కాంగ్రెస్ వారు ఢిల్లీకి ఏజెంట్లు అని, బీజేపీ వారు గుజరాత్కు బానిసలని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలందరి సహకారం ఎప్పుడూ ఉండాలని కో రారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, రాజ్య సభ సభ్యు డు వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, టీఆర్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ పాలక వర్గం, తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్లో మంత్రి గంగుల కమలాకర్కు శాలువా కప్పి, నాగలి బహూకరిస్తున్న విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ నాయకులు
30 ఎండ్ల సంది ఎదురు చూస్తున్నం
ఇండ్ల పట్టాల కోసం 30 ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. సీఎం కేసీఆర్ మాకు ఇంటి పట్టా ఇప్పించిండు. మా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇండ్ల పట్టాలు ఇప్పిస్తాం, కేసీఆర్కు అండగా నిలవాలని చెప్పిండు. మేము గట్లనే అన్నం. కేసీఆర్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినం. గిప్పుడు మా బిడ్డ సుమన్ చెప్పినట్లే చేసిండు. మాకు ఇండ్లకు పట్టాలు ఇప్పించిండు. గాయన సల్లంగా ఉండాలే.
– ఆల్ల కనకమ్మ, కనకదుర్గా కాలనీ
టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం
మామ సింగరేణి కంపెనీలోనే ఉద్యోగం చేసిండు. మా ఆయన కూడా ఎలక్ట్రిషియన్గా చేసేది. మేమే సొంతంగా ఇల్లు కట్టుకున్నం. మాకు హక్కు లేదనే బాధ ఉండేది. మంచిగ కట్టుకుందామంటే సింగరేణి వాచ్మెన్లు వచ్చి కట్టద్దని బెదిరిస్తుండేటోళ్లు. ఇప్పడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చొరవతో కేసీఆర్ ప్రభుత్వం మా ఇండ్లకు పట్టాలు ఇచ్చింది. మంత్రి చేతుల మీదుగా పట్టాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– సందుపట్ల యమున, 3వ వార్డు, శాంతినగర్
పట్టా తీసుకోవడం సంతోషంగా ఉంది
రామకృష్ణాపూర్ పట్టణంలో బీ- జోన్ మార్కెట్ ఏరియాలో 30 ఏండ్ల నుంచి షాపు నడుపుతున్న.ఎందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకు లు వచ్చి ఓట్లు అడిగి వెళ్లారే తప్ప ఏ ఒక్కరూ సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. ఇగ పట్టాలు రావని ఆశలు వదులుకున్నం. కాని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ సుమన్ చొరవతో ప్రత్యేకంగా జీవో 76 తెచ్చి పట్టాలు ఇచ్చారు. ఇందుకు సంతోషంగా ఉంది. వారికి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటాం.
– పరికిపండ్ల సుజాత, బీ-జోన్ సెంటర్
విప్ చొరవతో..
సొంతంగా ఇల్లు కట్టుకున్నా.. మాది కాదేమో అనిపించేంది. సింగరేణి స్థలం లో కట్టుకున్నందుకు హక్కులు ఉండేవి కావు. సింగరేణి ఎప్పుడు ఖాళీ చేయమంటదోనని భయంగా ఉండేది. పట్టాల కోసం 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నం. గత పాలకులు ఎన్నికల సమయంలో మాత్రమే మా ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తం అని చెప్పి ఓట్లు వేయించుకునే వాళ్లు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కల నెరవేరింది. విప్ ప్రత్యేక చొరవతో మా ఇండ్లకు పట్టాలు వచ్చినయ్.
– రాసపెల్లి రవి, పోచమ్మ బస్తీ