హైదరాబాద్ : పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వినకుండా ప్రజలు డబ్బుల మీద ఆశతో కొన్ని ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోతున్నారు. నగరంలో ఇలాంటి తరహా ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. ఓ మహిళ నుంచి రూ. 12 లక్షలకుపైగా దోచేశారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
లైటనింగ్ పవర్ అనే ఆన్లైన్ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు సూచించారు. తొలుత ఆమె తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడంతో ఎక్కువ లాభం చెల్లించారు. మరింత ఎక్కువ మొత్తం వస్తుందన్న ఆశతో బంధువుల వద్ద అప్పులు చేసి మరీ రూ.12,91,025 యాప్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాలానగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.