సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): కిట్టీ పార్టీల కిలాడీ శిల్పాచౌదరి మోసాల వెనకాల ఆమె భర్త శ్రీనివాస్ కీలకంగా ఉన్నారని పోలీసు దర్యాప్తులో స్పష్టమవుతున్నది. శిల్పా చౌదరి వసూలు చేసుకొని తెచ్చే డబ్బును శ్రీనివాస్ తనకు నచ్చిన వ్యాపారాల్ల్లో పెట్టినట్లు సమాచారం. సంపన్నులకు ఎర వేసేందుకు చేసే దావత్లకు(కిట్టీ పార్టీ) శ్రీనివాస్ చౌదరి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడని తెలిసింది.
కాగా, శిల్పా, శ్రీనివాస్ దంపతుల ఏడు రోజుల కస్టడీ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడిందని పోలీసులు చెప్పారు. మరోవైపు సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్లో బాధితురాలైన రోహిణి తనను శిల్పా దంపతులు రూ. 2.80 కోట్లు ముంచారంటూ.. ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శిల్పాచౌదరి దంపతులపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. మరికొందరు బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.