పెరటి కోళ్లతోపాటు ఫారం కోళ్లలోనూ అధిక మరణాలు కలిగించే వ్యాధి.. ఫౌల్ టైఫాయిడ్. సాల్మొనెల్లా గాలిసేరియం అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకి చనిపోయిన కోళ్లలో 3 నెలల వరకు బ్యాక్టీరియా జీవించే ఉంటుంది. నీళ్లు, దాణాతోపాటు దాణా పాత్రలు కలుషితం కావడం వల్ల ఈ వ్యాధి ప్రబలుతుంది. వ్యాధికి గురైన కోళ్లు, చనిపోయిన పిల్లలు, ఈగల ద్వారా ఒకదాని నుంచి మరో దానికి వ్యాప్తి చెందుతుంది. పెద్ద పక్షుల్లో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ, వ్యాధి వ్యాప్తికి కారణం అవుతాయి. పక్షుల శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా.. ‘ఎండోటాక్సిన్’ అనే విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది ఎర్రరక్తకణాల మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కోళ్లలో రక్తహీనత వచ్చి, వాటి బరువు తగ్గుతుంది. గుడ్ల ఉత్పత్తి పైనా ప్రభావం పడుతుంది.
లక్షణాలు : పక్షుల్లో ఈ వ్యాధి తీవ్రత దశలవారీగా ఉంటుంది. కొన్ని పక్షులు ఎలాంటి లక్షణాలు లేకుండానే చనిపోతుంటాయి. ఎక్కువగా ‘పుల్లోరం’ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధికి గురైన కోళ్లు బక్క చిక్కిపోతాయి. ఈకలు రాలిపోతాయి. చనిపోయిన కోళ్ల కాలేయం, గుండె కండరాలలో నెక్రోసిస్ (ఎముకలు, శరీర భాగాలు చచ్చుబడి పోవడం) లక్షణాలు గమనించవచ్చు. గుండె చుట్టూ ఫైబ్రస్ పొర అతుక్కుని ఉంటుంది.
చికిత్స : వ్యాధికి గురైన కోళ్లకు యాంటీ బయాటిక్ సెన్సిటివిటీ పరీక్ష చేసి.. దానికి సరిపోయే యాంటీ బయాటిక్ ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ‘పుల్లోరం’ వ్యాధికి ఉపయోగించే ఔషధాలను కూడా ఉపయోగించవచ్చు.