హైదరాబాద్ : స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆన్బోర్డ్ ఏవియేషన్ సౌకర్యంతో సహా అన్ని రకాల పరికరాలు, వివిధ పరిస్థితులు.. సవాళ్లకు అనుగుణంగా పరీక్షించినట్లు నేవీ ఆదివారం తెలిపింది. నౌకను నెలాఖరులోగా డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్లో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. భారత నౌకాదళం, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ నౌకను నిర్మించాయి. షిప్యార్డులో 2వేల మంది ఉద్యోగులతో పాటు వివిధ కంపెనీలకు చెందిన 12వేల మంది నిపుణులు నౌక నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో తొలి ట్రయల్స్ను గతేడాది ఆగస్ట్లో విజయవంతం పూర్తి చేసింది. అక్టోబర్లో రెండో దశ, ఈ ఏడాది జనవరిలో మూడ దశ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక చేరికతో భారత నేవీ బలం మరింత పెరుగనున్నది. ఈ నౌకలో 14 అంతస్తులుంటాయి. దీని బరువు 40వేల టన్నులు. 30 నుంచి 40 విమానాలను దీనిపై ఉంచొచ్చు. నౌక పొడువు 262 మీటర్లు, ఎత్తు 59 మీటర్ల ఉంటుంది. ప్రస్తుతం భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రమాదిత్యను కలిగి ఉంది. ఇదే దేశంలో ఏకైక విమాన వాహక నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ చేరికతో నేవీకి మరో వాహక నౌక అందుబాటులోకి రానున్నది.