Dasara Celebrations in Srisailam | శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. దేవి అవతరాల్లో కుష్మాండ దుర్గ సాత్విక రూపంలో సింహ వాహనాన్ని అధిష్టించి 8 చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృత కళశాన్ని దాల్చి భక్తులకు దర్శనమిచ్చినట్లు ఈవో లవన్న పేర్కొన్నారు. ఈ దేవిని పూజించడం వల్ల సర్వరోగాలు తొలగిపోయి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం.
అదే విధంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహదేవి అలంకారమండపంలో అర్చక వేదపండితులు, కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, ప్రత్యేక హరతులు, షోడశపూజలు నిర్వహించారు.
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. ప్రాకారోత్సవంలో కళాకారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయని పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా కళారాధనలో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ఆటపాటలు యాత్రికులను అలరించాయి. తేలికపాటి వర్షం కురవడంతో యాత్రికులు ఆద్యంతం కార్యక్రమాలను వీక్షించలేకపోయారు. చిరుజల్లుల కారణంగా గ్రామోత్సవం రద్దు చేసిన ఈవో లవన్న.. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ ఉత్సవాన్ని నిర్వహించారు.
శరన్నవరాత్రుల్లో ఐదోరోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు స్కందమాతా అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారితో కలిసి శేష వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ కేఎస్ లవన్న తెలిపారు.