ఉమ్మడి జిల్లాలో సత్తాచాటిన నలుగురు
ఆలిండియాలో 117, 161, 461, 574 ర్యాంకులు
హనుమకొండలో ఇద్దరు, వరంగల్, భూపాలపల్లిలో ఒక్కొక్కరు
ఐఏఎస్ కలను సాకారం
చేసుకున్న యువతేజాలు
భూపాలపల్లి టౌన్/నయీంనగర్/కరీమాబాద్ : సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో హనుమకొండ నుంచి ఇద్దరు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ నుంచి ఒక్కొక్కరు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్సే లక్ష్యంగా పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి అనుకున్నది సాధించారు. వీరిలో 117వ ర్యాంకుతో వ్యవసాయ కూలీ కొడుకు ఆకునూరి నరేశ్ ప్రతిభచాటగా, 161వ ర్యాంకుతో చైతన్యరెడ్డి, 461వ ర్యాంకుతో బైరి రుత్విక్, రెండో ప్రయత్నంలో వరంగల్ కరీమాబాద్కు చెందిన పార్వతి రంజిత్కుమార్ 574వ ర్యాంకుతో ఐఏఎస్ కావాలనే తమ కలలను నిజం చేసుకున్నారు.
సత్తాచాటిన చైతన్యరెడ్డి
ఆలిండియాలో 161వ ర్యాంక్
నయీంనగర్, మే 30 : సివిల్స్ ఫలితాల్లో ఓరుగల్లు యువతి బొక్క చైతన్యరెడ్డి తన ప్రతిభను చాటి ఫలితాల్లో 161వ ర్యాంక్ సాధించింది. హనుమకొండ విద్యారణ్యపురికాలనీకి చెందిన చైతన్య పదో తరగతి వరకు హనుమకొండలోని స్కాలర్స్ హై స్కూల్లో, ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్యలో, బీటెక్ వరంగల్ నిట్లో పూర్తి చే సింది. బీటెక్ చేస్తున్న క్రమంలోనే ఆల్స్ట్రోమ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ వస్తే ఆరు నెలలు చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రాజీనామా చేసి 2016లో మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ ఏఈగా జాబ్ సాధించింది. అక్కడ పనిచేస్తూనే సివిల్స్కి ప్రిపేరయ్యింది.
వీరి స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం చిల్పకుంట్ల. చైతన్యరెడ్డి తండ్రి బొక్క సంజీవరెడ్డి 20సంవత్సరాల క్రితం హనుమకొండలో స్థిరపడ్డారు. ఈయ న వరంగల్ డీసీఓగా పనిచేశారు. సంజీవరెడ్డి-వినోద దంపతులకు రవికిరణ్రెడ్డి మొదటి కుమారుడు, రెండవ సంతా నం చైతన్యరెడ్డి, మూడవ సంతానం సత్యనాథన్రెడ్డి. వీరిలో రవికిరణ్రెడ్డి బుక్స్ రా స్తాడు, మూడు సంవత్సరాలుగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. సత్యనాథన్రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అన్న సహకారంతోనే..
మా అన్న రవికిరణ్రెడ్డి ప్రోత్సాహం వల్లే నేనే సివిల్స్ సాధించాను. జాబ్ చేసి ఎంత అలిసిపోయి వచ్చినా కూడా తను చదువుతూ నాకు వినిపించి వివరించేవాడు. అన్నతో పాటు నాన్న సంజీవరెడ్డి, అమ్మ వినోద సహకరించారు. స్కూల్లో చదివేటప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిని కావాలనే తపన చాలా ఉండేది. సివిల్స్లో జాబ్ కొడితే ఇతరులకు సహాయం ఏ విధంగా అందిస్తామో అని చాలాసార్లు వివరంగా చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎలాగైనా సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించాలన్న నా కల నిజం అయ్యింది. ఒక పక్క జాబ్ చేసుకుంటూనే మరోపక్క ఎంతో కష్టపడి చదివాను. సాధించాలనే తపన ఉంటే సరిపోదు దానికి కావాల్సిన కసరత్తు చేయాలి. సమయం ఎంతో విలువైనది. పుస్తకాలకు మన సమయం కేటాయిస్తే భవిష్యత్లో అవి మనల్ని సమాజంలో తలెత్తుకునేలా చేస్తాయి.
కూలీ కొడుకు ప్రతిభ..
117వ ర్యాంకు సాధించిన భూపాలపల్లి యువకుడు ఆకునూరి నరేశ్
భూపాలపల్లి టౌన్, మే 30 : పేదింటి బిడ్డ సివిల్స్లో సత్తాచాటాడు. 117వ ర్యాంకు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పేరు తెచ్చాడు. జిల్లాకేంద్రంలోని కాశీంపల్లికి చెందిన ఆకునూరి ఐలయ్య, సులోచన దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. గ్రామంలో ఐలయ్య వ్యవసాయ కూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్సోర్సింగ్లో స్వీపర్గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు నరేశ్ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివి సివిల్స్ ర్యాంకు సాధించాడు. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి 6నుంచి 10వరకు నర్సంపేటలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యనభ్యసించాడు. హైదరాబాద్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఐఐటీలో ర్యాంకు రావడంతో మద్రాస్లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం చెన్నైలో సిటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే శంకర్ ఐఏఎస్ ఆకాడమీలో ఏడాది పాటు కోచింగ్ తీసుకున్నాడు. అదే సమయంలో రైల్వే రిక్రూట్మెంట్లో పరీక్ష రాసి పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు. పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం శిక్షణ పొందుతూనే సివిల్స్ పరీక్షలు రాస్తూ 5వ అటెంప్ట్లో 117వ ర్యాంకు సాధించాడు నరేశ్. నరేశ్ సివిల్స్లో ర్యాంకు సాధించడం పట్ల కాశీంపల్లిలో తన స్నేహితులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు.
పట్టుబట్టి సాధించిన వరంగల్ తేజం
కరీమాబాద్, మే 30 : సివిల్స్ పరీక్షల్లో వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం కరీమాబాద్ తోట్లవాడకు చెందిన పార్వతి రంజిత్కుమార్ 574వ ర్యాంకు సాధించాడు. వరంగల్లోని జవహర్ నవోదయ పాఠశాలలో చదువుకున్నాడు. భాష్యం కళాశాలలో ఇంటర్, నిట్ రాయపురలో విద్యాభ్యాసం కొనసాగించా డు. 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండేళ్లు ఉద్యోగం చేశాడు. 2020లో మొదటిసారి ప్రయత్నించి విఫలమైనా ప్రస్తుతం 574వ ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణించే తమ కుమారుడు సివిల్స్లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. కాలనీవాసులు, బంధువులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతుండడం చూసి గర్వపడ్డారు. రంజిత్ తండ్రి కృష్ణంరాజు టీఆర్ఎస్ నేతగా, కాపు సంఘం నేతగా సుపరిచితుడు. తల్లి మాధవి గృహిణి. వీరికి రంజిత్కుమార్తో పాటు కూతురు రష్మిక ఉంది.
కరీమాబాద్ బిడ్డ కలెక్టర్గా రావాలి..
అండర్రైల్వేగేట్ ప్రాంతంలో ఉండేది ఎక్కువగా పేదవారే. ఇక్కడి నుంచి ఓ యువకుడు సివిల్స్లో ర్యాంకు సాధించడం తమ ప్రాంతానికే గర్వంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్కుమార్ కలెక్టర్గా రావాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు వరంగల్కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుతున్నారు.
బైరి రుత్విక్కు 461వ ర్యాంక్
నయీంనగర్, మే 30 : కాకతీయ విశ్వవిద్యాలయ బిల్డింగ్ డివిజన్ ఉద్యోగిగా పని చేస్తున్న బైరి శివశంకర్ కుమారుడు రుత్విక్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియాలో 461ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.