హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోటు చేసుకున్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు ఆటో జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్నది.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు కంటైనర్ లారీ వెళ్తున్నది. రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది. ఐదుగురు మృతదేహాలు మాత్రం బయటకు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆటోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆటో రాంగ్రూట్లో వేగంగా రావడంతో పాటు అదే సమయంలో కంటైనర్ వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న విషయాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం పోలీసులు మృతులకు సంబంధించిన ఫోన్ల ద్వారా.. అందులో డయల్ చేసిన నంబర్ల ద్వారా మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.