హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని నిలోఫర్ దవాఖాన గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒకరికి జరిగే ఇలాంటి కాన్పులో సాధారణంగా తల్లీ, బిడ్డలకు క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయని, కానీ తమ కృషి వల్ల అంతా సానుకూలంగా జరిగిందని పేర్కొన్నారు.
ఖైరతాబాద్లోని ఎంఎస్ మక్తాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ఘోరీ, అమీనా ఉన్నిస్సా దంపతులకు ఇద్దరు సంతానం. మూడోసారి గర్భం దాల్చిన అమీనాకు స్కానింగ్ చేయగా ఆమె కడుపులో నలుగురు శిశువులు ఉన్నట్టు స్థానిక దవాఖాన సిబ్బంది తెలిపారు. దీంతో ఆమెను 6వ నెల చివరలో దవాఖానలో చేర్చకున్నామని డాక్టర్ చెప్పారు. 8 నెలలు నిండిన అమీనాకు 14న నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా ముగ్గురు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నిలోఫర్లో జరిగే ప్రసవాలలో ప్రతి నెలా 25 నుంచి 30 వరకు కవలలు జన్మిస్తుంటారు. నెలలో కనీసం ఒకసారి ముగ్గురు శిశువులు జన్మిస్తుంటారు. కాని ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించటం, వారంతా క్షేమంగా ఉండటం అరుదు.