హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారిచేందుకు పాఠశాలల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపి వండిన ఆహారాన్ని విద్యార్థులకు అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించాలని కేంద్రం ఇటీవలే రాష్ర్టాలను ఆదేశించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా ఆ బియ్యాన్ని సరఫరా చేస్తామని పేర్కొంది. దాంతో ఫోర్టిఫైడ్ బియ్యం కోసం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఎఫ్సీఐకి లేఖ రాసింది.
ఫోర్టిఫైడ్ బియ్యం ఎందుకు?
మన దేశంలో అత్యధిక మందికి బియ్యమే ప్రధాన ఆహారం. వడ్లను మర ఆడించేటప్పుడు అధికంగా పాలిష్ చేస్తుండటంతో పోషకాలన్నీ పోయి బియ్యంలో కేవలం కార్బొహైడ్రేట్లు మాత్రమే మిగులుతున్నాయి. ఆ బియ్యం తిన్న మహిళలు, పిల్లల్లో పోషకాల లోపంతో రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా ప్రజల ఆహారపు అలవాట్లను వెంటనే మార్చాల్సిన అవసరంలేకుండా బియ్యానికి అవసరంమేరకు సూక్ష్మపోషకాలను జోడించి ఆహారంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అరటిపండు, కోడిగుడ్డు..
కేంద్రప్రభుత్వంకంటే ముందే రాష్ట్ర సర్కారు పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పలు చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజనాన్ని ఆకలితీర్చే పథకంగానే చూడకుండా పోషకాహారాన్ని సమకూర్చే పథకంగా మార్చింది. సొంత ఖర్చులతో కోడిగుడ్డు, అరటిపండ్లను అదనంగా అందజేస్తున్నది. దేశంలోనే మొదటిసారి మధ్నాహ్న భోజనంలో సన్నబియ్యాన్ని వాడటం మొదలుపెట్టింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మాత్రమే 9,10 తరగతులవారికి మధ్యాహ్నభోజనాన్ని అందిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1-8 తరగతులవారికి మాత్రమే అందుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నెలకు 12 ఉడకబెట్టిన కోడిగుడ్లను (వారంలో మూడు రోజులు) అందజేస్తున్నారు. తాజాగా పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణలోని పాఠశాలల్లో రాగిజావ, లేత మొలకలు, బెల్లం, పల్లీపట్టి వంటి వాటిని అందజేస్తున్నారు. 8 లక్షల మంది విద్యార్థులకు 60 రోజులపాటు వీటిని అందిస్తారు.
ఫోర్టిఫైడ్ ఎలా చేస్తారు?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం సాధారణ ఆహారానికి అవసరమైన మోతాదులో సూక్ష్మ పోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్)ను జోడించి అందించటమే ఫోర్టిఫైడ్. ఫోర్టిఫైడ్ ప్రక్రియకు ప్రస్తుతం రెండు విధానాలుగా ఉన్నాయి. 1.కోటింగ్. 2.డస్టింగ్. కోటింగ్ ప్రక్రియలో బియ్యం వంటి సాధారణ ఆహార పదార్థాలకు సూక్ష్మ పోషకాలను ప్రత్యేక యంత్రాల ద్వారా కోటింగ్లా వేస్తారు. డస్టింగ్ ప్రక్రియలో బియ్యాన్ని పిండిలా మార్చి అందులో అవసరమైన పరిమాణంలో పోషకాలను కలుపుతారు. ఆ పిండికి నీటితో కలిపి యంత్రాల ద్వారా మళ్లీ బియ్యపు గింజల్లా మారుస్తారు. ఆ బియ్యపు గింజలను ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ (ఎఫ్ఆర్కే) అంటారు.
ఎలా తీసుకోవాలి?
కేవలం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా వండుకొని తినకూడదు. 1 కిలో సాధారణ బియ్యంలో పది గ్రాముల ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే కలిపి ఆహారంగా తీసుకోవాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. వంద కిలోల బస్తాకు ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యం సరిపోతాయి. ఫోర్టిఫైడ్ బియ్యంలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, ఫోలిక్యాసిడ్, విటమిన్ బీ -12 వంటి పోషకాలను కలుపుతారు. దాంతో ఆ బియ్యం తిన్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత, విటమిన్ల లోపం తగ్గుతుంది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఫోర్టిఫైడ్ బియ్యపు గింజలు ఎంత పరిమాణంలో ఉండాలో కూడా కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బియ్యపు గింజ పొడవు 5 మిల్లీ మీటర్లు, మందం 2.2 మిల్లీ మీటర్లకు దాటరాదని పేర్కొంది. ఈ బియ్యం జీవిత కాలం 12 నెలలు మాత్రమే.