అంబర్పేట, అక్టోబర్ 23ః దేశాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కాపాడిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ఎమ్మెల్సీ సురభివాణిదేవి నివాళులు అర్పించారు. ఆయన తరఫున భారత్ శాంతిదూత్ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యానగర్లోని హిందీ మహావిద్యాలయంలో శనివారం భారత్ శాంతిదూత్ అవార్ట్స్-2021 కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సురభివాణిదేవి మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడైన పీవీ శాంతి కాముకుడని చెప్పారు. ఆయన కూతురునైన తనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ శత జయంతి వేడుకలను కేసీఆర్ ఘనంగా నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డైరెక్టర్ ఎంనాగేశ్వరరావు, సొసైటీ గౌరవ అధ్యక్షుడు అంపశయ్య నవీన్ మాట్లాడారు. వాణిదేవితో పాటు తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు, బ్రిగేడియర్ గణేశం, సురేంద్ర లూనియా, దీపక్ భట్టాచార్యలకు భారత శాంతిదూత అవార్డులను అందించారు. సొసైటీ అధ్యక్షుడు ఎండీ సిరాజుద్దీన్, ప్రొఫెసర్ సురేష్లాల్, ప్రొఫెసర్ నరసింహమూర్తి, భూపతిరాజ్, నిమ్మల శ్రీనివాస్, శ్రీపాద సుధాకర్, శనిగరపు రాజమోహన్, జెల్లంకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.