నాంపల్లి క్రిమినల్ కోర్టు, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి శంకర్రావు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో బుధవారం సొమ్మసిల్లి పడిపోయారు. షాదనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరేండ్ల క్రితం శంకర్రావు ఓ భూ వివాదంలో జోక్యం చేసుకొని పలువురిని బెరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళను బెదిరించారని కూడా ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ బుధవారం తీర్పు చెప్పారు. శంకర్రావుకు మొదట కోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. అయితే, న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలో కోర్టు హాల్లోనే శంకర్రావు వీల్చైర్లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శిక్షను రద్దుచేసి ఓ కేసులో రూ.2,000, మరో కేసులో రూ.1,500 జరిమానా విధించిది. మూడో కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేశారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. శంకర్రావు పై కోర్టులో అప్పీల్ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది.