మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశం అట్టుడుకుతోంది. రెండు వర్గాల నిరసనలు, బంద్ లతో దేశం హోరెత్తుతున్న వేళ ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందించాడు. నుపుర్ శర్మ దిష్టిబొమ్మను ఉరితీయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు. ఇది 21వ శతాబ్దమని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించాడు.
నుపుర్ శర్మకు వ్యతిరేకంగా కర్నాటకలోని బెల్గావిలో మసీదు వద్ద ఆమె దిష్టిబొమ్మను వేలాడదీయడంపై ట్విటర్ వేదికగా వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఇది కర్నాటకలో నుపుర్ శర్మ దిష్టిబొమ్మను ఉరితీస్తున్న దృశ్యం. ఇది చూస్తుంటే మనం 21వ శతాబ్దంలోనే బతుకుతున్నామా అని అనిపిస్తున్నది. ప్రజలారా.. దయచేసి రాజకీయాలను పక్కనబెట్టండి. చిత్తశుద్ధితో బతకండి. ఇప్పటికే చాలా చేశారు..’ అని ట్వీట్ చేశాడు.
వెంకటేశ్ ప్రసాద్ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో ఇది కాస్తా వైరల్ గా మారింది. సాధారణంగా క్రికెటర్లు గానీ సెలబ్రిటీలు గానీ ఇలాంటి సున్నితమైన సమస్యలపై స్పందించడం చాలా అరుదు. మళ్లీ కొద్దిసేపటికే ఆయనే తిరిగి మరో ట్వీట్ చేస్తూ.. ‘ఇది కేవలం దిష్టిబొమ్మ కాదు. చాలామంది వ్యక్తులకు ముప్పు..’ అని పేర్కొన్నాడు. అయితే వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This is an effigy of Nupur Sharma hanging in Karnataka.
Simply cannot believe that this is 21st century, India.
I would urge everyone to leave politics aside and let sanity prevail. This is just too much. pic.twitter.com/Bl1K7Ke9qf— Venkatesh Prasad (@venkateshprasad) June 10, 2022