న్యూఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగియగా.. చివరి రోజు మిస్టర్ డింపెండబుల్ తన అప్లికేషన్ను బీసీసీఐకి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు కోచింగ్ బాధ్యతలు భుజాలకెత్తుకోనున్నాడు. ‘అవును. రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్ పదవికి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్సీఏలో అతడితో కలిసి పనిచేసిన బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ ఇదివరకే తమ అప్లికేషన్లు పంపారు.
ద్రవిడ్ ఎంపిక లాంఛనమే’ అని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాతో భేటీ అయిన ద్రవిడ్.. దాదాతో సుదీర్ఘంగా చర్చించాక బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. నిబంధనల ప్రకారం క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) త్వరలోనే ద్రవిడ్కు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గడువు ముగియనుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.