యమునానగర్ : హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు. ఈ క్రమంలో ప్రైవేటులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. కమలా వర్మ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు. సుపరిపాలన పట్ల ఆమె ఉన్న అంకిత భావం.. ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తుందన్నారు.
హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధంకర్ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ హర్యానా యూనిట్ మొదటి అధ్యక్షురాలిగా పని చేసిన కమలా వర్మ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులతో కలిసి పని చేశారని ధంకర్ తెలిపారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమన్నారు. కమలా వర్మ 1977లో హర్యానాలోని యమునానగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1977, 1987, 1996ల్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.