ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.
పంత్ తన బ్యాటును ఎక్కువ కాలం సైలెంట్గా ఉంచకూడదని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘దినేష్ కార్తీక్, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఆడే 11 మందిలో ఉన్నారు. వీళ్లిద్దరూ వికెట్ కీపర్లే. వీళ్లు కాకుండా సంజూ శాంసన్ కూడా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. కచ్చితంగా జట్టులో ఉండే కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చెయ్యగలడు. అంటే వికెట్ కీపింగ్ బ్యాటర్ స్థానానికి చాలా గట్టిపోటీ ఉంది.
అలాంటప్పుడు ఎక్కువ కాలం బ్యాటును సైలెంట్గా ఉంచితే కష్టం’’ అని పఠాన్ వివరించాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్.. టీ20ల్లో భారత్ తరఫున పెద్దగా రాణించలేదు. పొట్టి ఫార్మాట్లో పంత్ రికార్డు చాలా పేలవంగా ఉంది. భారత్ తరఫున ఇప్పటి వరకు 45 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన పంత్.. 23 సగటు, 126 స్ట్రైక్ రేట్తో కేవలం 717 పరుగులు మాత్రమే చేశాడు.