శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో చేపడుతున్న మొదటి బొగ్గు గని నైనీ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు అతి కీలకమైన తొలిదశ అటవీ అనుమతి లభించింది. సింగరేణికి అటవీ భూమి కేటాయింపుపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన ఆనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 783.27 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి కేటాయించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ ఆనుమతి లభించిన వెంటనే ఆటవీ భూమిని సింగరేణికి బదలాయించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఒడిశాలోని అంగూల్ అటవీ డివిజన్ ప్రాంతంలోని చెండిపాద, కుంకురుపాల్లో ఉన్న 643.095 హెక్టార్ల రిజర్వుడ్ ఫారెస్ట్ భూమి, 140.18 హెకార్ల గ్రామ అటవీ స్థలాన్ని నైనీ ప్రాజెక్టుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లయింది. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నైనీ బొగ్గు గనికి మొత్తం 912.7 హెక్టార్ల భూమి అవసరం కాగా, అందులో 783.27 హెక్టార్ల మేరకు అటవీ భూమి ఉంది. అధిక మొత్తం అటవీ భూమి కావడం వల్ల ప్రాజెక్టు ప్రారంభానికి అటవీ అనుమతులు అతి కీలకంగా మారాయి. తాజాగా తొలి దశ అనుమతులు లభించడంతో ప్రాజెక్టు నుంచి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి మార్గం సుగుమమైంది.