Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంతి భగవంత్మాన్ వివాదంలో చిక్కుకున్నారు. విదేశీలు కూడా పంజాబ్కు వచ్చి ఉద్యోగాలు పొందొచ్చని శనివారం వ్యాఖ్యానించారు. పంజాబ్ నుంచి మేధో వలసలను నివారించాలన్న అంశంపై మాట్లాడుతూ భగవంత్మాన్ చేసిన ఈ వ్యాఖ్యపై ప్రధాన విపక్ష కాంగ్రెస్ మండి పడింది. పంజాబ్కు విదేశీయులను ఆహ్వానించడానికి ముందు రాష్ట్రంలో సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు చెప్పింది.
ప్రతిఏటా మూడు లక్షల మంది పిల్లలు విదేశాలకు వెళుతున్నారు. కేవలం పిల్లలు మాత్రమే కాదు. ఒక వ్యక్తిపై ప్రభుత్వం రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నది. వారు విదేశాలకు వెళ్లిపోవడంతో ఒక్కొక్కరిపై రూ.15 లక్షలు వృథా ఖర్చు అవుతుంది. మాకు కొంత సమయం ఇస్తే విదేశీయులు సైతం ఉద్యోగాలు కోరే పరిస్థితిని పంజాబ్లో సృష్టించగలం అని అంటున్న వీడియో క్లిప్ను భగవంత్ మాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
మేధోవలస తప్పనిసరిగా నివారించాల్సిందే. ఏ ఒక్కరూ ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భగవంత్మాన్ అన్నారు. యువత విదేశాలకు వెళ్లొద్దని కోరారు. విదేశాలకు వెళ్లిన యువకులు తిరిగి వచ్చి దేశానికి సేవ చేయాలని అభ్యర్థించారు.
భగవంత్మాన్ వ్యాఖ్యలపై పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ రియాక్టయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలను ట్విట్టర్లో వివరించారు. విదేశీయులను రాష్ట్రానికి ఆహ్వానించడానికి ముందు `మన ఇంటిని చక్కదిద్దుకోవాలి` అని సూచించారు. `విదేశీయులు ఉద్యోగాల కోసం పంజాబ్కు రావచ్చు. కానీ ముందు మన ఇంటి (రాష్ట్రాన్ని)ని చక్కదిద్దుకోవాలి. యువతకు ఉపాధి అవకాశాలపై హామీలు కల్పించాలి. శాంతిభద్రతలను పరిరక్షించాలి. అవినీతికి చరమగీతం పాడాలి. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు, కార్మికుల ఆత్మహత్యలను నివారించాలి` అని పేర్కొన్నారు.