న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. లక్షలు ఖర్చు అయినా సరే.. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థుల ఆలోచన. మెరుగైన ఉద్యోగం పొందడంలో, పోటీలో ముందు ఉండేందుకు విదేశీ విద్యాసంస్థల్లో డిగ్రీలు కీలక పాత్ర పోషిస్తాయని దాదాపు 83 శాతం భారతీయ విద్యార్థులు విశ్వసిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.
రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ఆదాయం ఉండే 57 శాతం భారత మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు, ఖర్చు భరించేందుకు మొగ్గు చూపుతున్నారని మంగళవారం విడుదలైన ది లీప్-ఇప్సోస్ స్ట్రాటజీ స్టడీ అబ్రాడ్ ఔట్లుక్ నివేదిక పేర్కొన్నది. లీప్ సహవ్యవస్థాపకులు వైభవ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ విదేశీ విద్య మార్కె ట్ పలు రెట్లు పెరుగనున్నదని అభిప్రాయపడ్డారు. 2025 నాటికి 20 లక్షల మంది విద్యార్థులు విద్య కోసం బయటి దేశాలకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు.