న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా పనిచేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది కాదనలేని వాస్తవం. రోజూ కంటినిండా కునుకు తీసేందుకు సహకరించడంలోనూ ఆహారం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితంలో నిద్ర లేమి మనల్ని వెంటాడుతోంది. ఆహారం, జీవనశైలిలో మార్పులతో సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సరైన నిద్ర కోసం తేనెను తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా సుఖ నిద్రను ప్రసాదిస్తాయి. గోరువెచ్చని నీళ్లు లేదా పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకుంటే హాయిగా నిద్రపడుతుందని చెబుతున్నారు. పాలు తాగడం ద్వారా నిద్రలేమి సమస్యలను అధిగమించవచ్చని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఇక ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన నట్స్తో సుఖ నిద్రను సొంతం చేసుకోవచ్చు. కొన్ని నట్స్లో ఉండే మెలటోనిన్ మెరుగైన మూడ్ను ఇవ్వడం ద్వారా సుఖ నిద్రకు దారితీస్తుంది. రాత్రి నిద్రపోయేముందు బాదం, వాల్నట్స్, పిస్తా వంటి నట్స్ను పరిమిత మోతాదులో తీసుకోవాలి. ఫ్యాటీ ఫిష్, తేనీరును నిత్యం తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యలను అధిగమించవచ్చు.