Stock Markets | ద్రవ్య పరపతిపై ఆర్బీఐ సమీక్ష, అమెరికా డాలర్పై రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు గురువారం స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఫలితంగా ఉదయం సానుకూల వాతావరణంలో లాభాలతో ట్రేడింగ్ మొదలైనా మధ్యాహ్నానికి నష్టాలతో ముగిశాయి. అమెరికా స్టాక్ మార్కెట్స్లో ఫ్యూచర్స్ భారీ నష్టాలు నమోదు కావడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 188.32 పాయింట్ల పతనంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, 40.50 పాయింట్ల నష్టంతో 16,818.10 పాయింట్ల వద్ద ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ స్థిర పడ్డాయి.
అంతకుముందు గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 56,997.90 పాయింట్ల వద్ద సానుకూల ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రా డే ట్రేడింగ్లో 57,166.14 పాయింట్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి.. తిరిగి 56,314.05 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ముగింపు సమయానికి 188.32 పాయింట్లు నష్టంతో 56,409.96 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్లో 17,026.05 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి, 16,788.60 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 40.50 పాయింట్ల నష్టంతో 16,818.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ రూ.81.88 వద్ద ముగిసింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్లో 15 స్క్రిప్ట్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, సన్ఫార్మా, నెస్ట్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అల్ట్రా టెక్ సిమెంట్ లబ్ధి పొందాయి. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టైటాన్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ భారీగా నష్టపోయాయి.
ఇక మార్కెట్ లీడర్ రిలయన్స్ స్క్రిప్ట్ గురువారం అంతర్గత ట్రేడింగ్లో ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయి రూ.2,315.55 వద్దకు చేరింది. ఈ వారం ట్రేడింగ్లో రిలయన్స్ షేర్ ఏడు శాతానికి పైగా నష్టపోయింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.2,328 (0.19 శాతం నష్టం) వద్ద స్థిర పడింది. సన్ ఫార్మా గత రెండు సెషన్లలో ఏడు శాతానికి పైగా లాభంతో 954.25 వద్దకు చేరుకుని ఐదు నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ వాటా పెరుగుదలతో అందులోని తమ 20 శాతం వాటాలో కొంత విక్రయిస్తామని అదానీ టోటల్ ఎనర్జీ తెలిపింది. దీంతో అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ 3.03 శాతం నష్టంతో రూ.1,989 వద్ద ముగిసింది.