సత్యసాయి జిల్లా : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సాయుధ విప్లవాన్ని ఉధృతం చేసిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అని అభివర్ణించారు. బ్రిటీష్ పాలకులను, సైన్యాన్ని తన కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేసిన తీరు బ్రిటిష్ ప్రభుత్వంలో భయాందోళనకు గురి చేసిందని చెప్పారు.
బ్రిటీష్ సైన్యానికి ముందస్తు సమాచారం అందించిన అతడి స్ట్రైకింగ్ ఆపరేషన్లు అతడ్ని బ్రిటిష్ పాలనలోనే హీరోగా నిలబెట్టాయని బసంత్ కుమార్ అన్నారు. అతడి దేశభక్తి స్ఫూర్తి భారతీయ జాతీయవాదం జ్వాలలను రేకెత్తించిందని, దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టేందుకు అనేకమందిని ప్రేరేపించిందని గుర్తుచేశారు. భారతీయుల గుండెల్లో ఇప్పటికీ మరువలేని వీరుడుగా నిలిచిపోయారని అనంతపురం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ శ్లాఘించారు.
అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారిలో డీటీడబ్ల్యూవో అన్నాదొరై, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, హార్టికల్చర్ డీడీ పద్మలత, సెరీకల్చర్ డీడీ శాంతి, మైనార్టీల సంక్షేమ శాఖ డీడీ మహమ్మద్ రఫీ, వికలాంగుల శాఖ డీడీ మహ్మద్ రఫీ, టూరిజం అధికారి దీపక్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4 వరకు అల్లూరి జయంతి వారోత్సవాలను నిర్వహిస్తున్నది.