శ్రీశైలం : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ప్రాజెక్టు ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు.
జూరాల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా 2,07,176 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,475, సుంకేశుల నుండి 67,312, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రం వరకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 2,05,649 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదయింది.
అదేవిధంగా 5 గేట్లను 10 అడుగుల ఎత్తులో ఎత్తి 1,39,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 27,334, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 211.95 టీఏంసీలు కాగా, పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఏంసీలు.