అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతి కొనసాగు తోంది. దీంతో 3 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 4,605 వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 30,733 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 20,768 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.586 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.93 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్లు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో పాటు టీబీ డ్యాం వరద తోడవడంతో ఆర్డీఎస్ ఆనకట్ట వరద నీరు భారీగా చేరుతోంది.
ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 63,579 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 63,100 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.6అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 479 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.