హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వరదలతో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకాశ్ నమస్తే తెలంగాణతో మాట్లాడారు. 1986లో వరదలకంటే ఈసారి తక్కువగానే వచ్చాయని, అయి నా ముంపు ఎక్కువగా ఉండటానికి పోలవరమే కారణమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వరదలను అంచనా వేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ముందస్తుగా వరదలపై అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. కేం ద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఒక్క రు కూడా వరదలపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.
రాజమండ్రికీ ముప్పే
పోలవరం ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న ధవళేశ్వరం, రాజమండ్రికి సైతం తీవ్ర ముప్పు పొంచి ఉన్నదని వీ ప్రకాశ్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును తొలుత 36 లక్షల్య క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేసి, ఆ తరువాత 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని.. పెంచిన సామర్థ్యం మేరకు వాటిల్లే ముంపుపై సరైన అధ్యయనం చేయలేదని తెలిపారు. ముంపుపై మరింత శాస్త్రీయ అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును 50 లక్షల డిశ్చార్జి కెపాసిటీతో నిర్మిస్తున్నారని, ఆ మేరకు దిగువ ధవళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని సైతం పెంచాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టడంలేదు కాబట్టి.. పోలవరం వద్ద నీటిని నిల్వ చేయడమే ఏపీ ఆంతర్యంగా కనిపిస్తున్నదని అన్నారు. దీనివల్ల భవిష్యత్లో ఊహించని వరదలు వచ్చినప్పుడు ధవళేశ్వరం, రాజమండ్రికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. పోలవరం డ్యాం భూకంప ప్రభావిత జోన్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ డ్యాం బ్రేక్ అనాలసిస్ చేయలేదని విమర్శించారు.
పోలవరంతోనే ముంపు
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలానికి వరద ముంపు పొంచి ఉన్నది. 1953, 1986, 1990లో వరదలు చూశా. కానీ, ఇంత వేగంగా వరద రావడం, నెమ్మదిగా తగ్గడం జరగలేదు. పోలవరం బ్యాక్వాటర్తో వరద కొద్దికొద్దిగా తగ్గుతుంది. దీనిపై ఇరు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పుడు వరద వచ్చినా 50 నుంచి 55 అడుగుల ప్రవాహం ఉండేది. ఈసారి 71.4 అడుగులు నమోదైంది. ప్రభుత్వ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది.
– వీ శేషగిరిరావు, ఆర్టీసీ రిటైర్డ్ కంట్రోలర్, భద్రాచలం
ఆంధ్రా వద్దు.. తెలంగాణే ముద్దు
తెలంగాణలో కలపాలని ప్రజల ఆందోళన
భద్రాచలం, జూలై 19: ‘ఆంధ్రా వద్దు.. తెలంగాణే ముద్దు’ అంటూ ఏపీలో విలీనమైన ఎటపాక, కన్నాయిగూడెం ప్రజలు మంగళవారం ధర్నా చేశారు. గోదావరి వరదతో తమ గ్రామాలు నీట మునిగినా.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఎవరూ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోఉండి ముంపు బాధితులకు వసతులు కల్పించారని, సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారని పేర్కొన్నారు. ఆంధ్రాలో కలిపి అన్యాయం చేశారని వాపోయారు. ఇప్పటికైనా తెలంగాణలో కలపాలని కోరారు.
తెలంగాణే మేలు..
తెలంగాణలో కష్టం వస్తే మంత్రులు వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ఆదుకొంటున్నారు. ఏపీలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కరెంటు లేకుండా వారం రోజులుగా అంధకారంలో మగ్గినా ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే గానీ వచ్చి పరామర్శించలేదు. మమ్మ ల్ని తెలంగాణలో కలిపేయండి. ముంపు బాధితుల కోసం రూ.వెయ్యి కోట్లతో ఎత్తయిన ప్రదేశంలో కాలనీలు కట్టిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
–పార్వతమ్మ, ఈశ్వరయ్య, ఎటపాక