నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 13 : కృష్ణానది ఉరకలేస్తున్నది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తున్నది. సుమారు 3 లక్షలకుపైగా ఇన్ఫ్లో రాగా మం గళవారం జలాశయం 9 గేట్లను పది అడుగులకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులు నమోదైంది. జూరాల ప్రాజెక్టు 42 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 2.20 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1.98 లక్షలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 3,14,235 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దాంతో ఎన్నెస్పీ అధికారులు సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 2,81,187 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589 అడుగులు (309.5070 టీఎంసీలు)గా ఉన్నది.
గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. 8 గేట్లను ఎత్తి 24,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1,090.30 అడుగుల (86.461టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టడంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 18 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్కు ఇన్ఫ్లో 10,99,550 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.