శ్రీశైలం : ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. ఆదివారం జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 45,144, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 42,408, సుంకేశుల నుంచి 30,177 క్యూసెక్కులు నీరు విడుదల కాగా రిజర్వాయర్కు 1,17,444 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 884.90 అడుగుల మేర నీరున్నది.
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.3263 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. రెండు గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ద్వారా 31,165, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద నీటిని సాగర్ వైపునకు వెళ్తున్నది. ఏపీ పవర్హౌస్లో 14.569 మిలియన్ యూనిట్లు, టీఎస్ పవర్హౌస్లో 17.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.