న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు కొనసాగతున్నది. ఉక్రెయిన్లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్లోని రెస్జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. పోలండ్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి చేరింది. మరో రెండు విమానాలు నేడు పోలాండ్ నుంచి రానున్నాయి. వీటిలో మరో నాలుగు వందల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.
ఉక్రెయిన్లో సుమీలో తాము చిక్కుకుపోయామని, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతే అక్కడి నుంచి బయటపడగలిగామని ప్రేర్ణ అనే విద్యార్థిరిని చెప్పింది. తామున్న ప్రాంతమంతా బాంబుల మోతతో దద్దరిల్లిందని తెలిపింది. తమకు భారత ఎంబసీ సహాయం చేసిందని ఆమె వెల్లడించింది. యుద్ధక్షేత్రం నుంచి తాము క్షేమంగా బయటపడటానికి భారత ప్రభుత్వం, రెడ్క్రాస్ తమకు సహకరించాయని హర్దీప్ అనే వైద్య విద్యార్థి చెప్పాడు.