మహబూబ్నగర్ : ఉన్నత విద్యావంతురాలైన వాణీ దేవి మచ్చ లేని వ్యక్తిత్వమని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. మహిళలపై అపారమైన గౌరవం ఉన్న సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉన్నత విద్యావంతురాలైన వాణీదేవికి టిక్కెట్ ఇచ్చారని ఆయన అన్నారు. వాణీదేవి ఇంతకు ముందు క్రియాశీల రాజకీయాల్లో లేరని.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ ఆరంగేట్రం చేశారని తెలిపారు.
సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్తో కలిసి మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు న్యాయవాదుల సమస్యలు తీరుస్తానని అందరిని సమీకరించారు. 100 రోజుల్లో హైకోర్ట్ విభజన చేస్తానని హామీ ఇచ్చి న్యాయవాదులను పట్టించుకోలేదన్నారు. హైకోర్టు విభజనలో రామచందర్ రావు పాత్ర సున్నా అని… సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో అనేకమార్లు చర్చించి న్యాయమైన డిమాండ్ ను పోరాడి సాధించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
న్యాయవాదులు సైతం తమ ఆందోళనతో కేంద్రాన్ని ఒప్పించగలిగేందుకు కష్టపడ్డారని గుర్తు చేశారు. ఇందులో బీజేపీ పాత్ర, రామచందర్ రావు పాత్రేమీ లేదన్నారు. ఈ అంశాలన్నిటినీ న్యాయవాదులు గమనించాలని కోరారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. కొన్ని అపోహల వల్ల దూరం పెరిగిందన్నారు. ఉద్యోగుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలంతా తమ సోదరి సురభి వాణీదేవికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పట్టం కట్టాలని కోరారు. విద్యారంగంపై విశేషమైన అనుభవం ఉన్న వాణీదేవి పట్టభద్రుల కోసం నిరంతరం పనిచేస్తారని ఆయన తెలిపారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. ఎన్నికలొచ్చాయంటే చాలు రెచ్చగొట్టడం బీజేపీకే సాధ్యమైందన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే పార్టీలపై యువత అప్రమత్తంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
ప్రశ్నించే గొంతుక అంటూ కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని.. ప్రశ్నించే వాళ్లు కావాలా.. పరిష్కారం చూపే వాళ్లు కావాలో పట్టభద్రులు ఆలోచించుకోవాలన్నారు. గత ఆరేళ్లుగా బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఏం ప్రశ్నించారు. ఏం పరిష్కారం చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లో అడ్వకేట్లు అడిగితే ఎమ్మెల్సీ గా ఉండి ఒక వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వలేకపోయాడన్నారు. తోటి న్యాయవాదులకే ఏమీ చేయలేని వ్యక్తి మిగతా వాళ్లకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన కె.నాగేశ్వర్ ను ప్రజలెవరూ గుర్తు కూడా పట్టరన్నారు పట్టభద్రులు ఆలోచించి జిల్లా వాసి అయిన వాణీదేవికి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్, టీఆర్ఎస్ నేత కె.ఎస్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.