న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. ఆ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందున దాన్ని బ్యాన్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంగళవారం పొద్దుపోయాక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపా చట్టం కింద పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ వుమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ రెహాబ్ కేరళ ఫౌండేషన్పై నిషేధం విధిస్తున్నామని పేర్కొన్నది.
‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందినవారే పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులు. వీరికి నిషేధిత జమాత్ ఉల్ ముజాయిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు.. ఐఎస్ఐఎస్తోనూ లింకులు ఉన్నాయి. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయి’అని తెలిపింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు కూడా పీఎఫ్ఐపై నిషేధానికి సిఫారసు చేశాయని గుర్తుచేసింది. కేంద్రం నిర్ణయంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులు సీజ్ కానున్నాయి. బ్యాంక్ అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేస్తారు. కాగా, వారం రోజులుగా పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై ఎన్ఐఏ, రాష్ర్టాల పోలీసు బృందాలు దాడులు నిర్వహించి, వందల మందిని అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.
సీఏఏ ఆందోళన తర్వాతే కేంద్రం నిఘా
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పీఎఫ్ఐ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఈ సంస్థకు చెందిన సభ్యులు మతమార్పిడులు, ఉగ్రవాదం, మనీలాండరింగ్కు పాల్పడటమే కాకుండా, నిషేధిత సంస్థలతో సంబంధం కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. పీఎఫ్ఐ 2006 డిసెంబర్ 19న ఏర్పాటైంది. ఈ సంస్థకు విదేశీ విరాళాలు వస్తున్నట్టు ఎన్ఐఏ ఆరోపిస్తున్నది.
పీఎఫ్ఐపై నిషేధం సరికాదు: అసదుద్దీన్
పీఎఫ్ఐ తీవ్రవాద చర్యలను తాను వ్యతిరేకిస్తానని, అయితే, కొందరి చర్యలను సాకుగా చూపి సంస్థ మొత్తాన్నీ నిషేధించటం సరికాదని మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ‘పీఎఫ్ఐపై నిషేధం విధించారు సరే. ఖవాజా అజ్మేరీ బాంబు దాడులకు పాల్పడినవారి సంగతేంటి? ఆ సంస్థలను ఎందుకు బ్యాన్ చేయటం లేదు?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలోని పెద్దలు ఫాసిజాన్ని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ముస్లింను ఉపా చట్టం కింద అరెస్టు చేయటం ఏమిటని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంపై పీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్ స్పందించారు. ‘కేంద్ర హోంశాఖ తీసుకొన్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. దేశ పౌరులుగా చట్టాన్ని గౌరవించాలి. పీఎఫ్ఐ కోసం చేసే అన్ని కార్యకలాపాలను ఆపేయాలని సభ్యులను కోరుతున్నా’అని పేర్కొన్నారు.
ఆరెస్సెస్ను కూడా బ్యాన్ చేయాలి
పీఎఫ్ఐని బ్యాన్ చేసినట్టే శాంతికి భంగం కలిగిస్తున్న ఆరెస్సెస్ను కూడా బ్యాన్ చేయాలని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏ సంస్థనైనా బ్యాన్ చేయాల్సిందేనని పేర్కొన్నారు. పీఎఫ్ఐపైనో, ఆరెస్సెస్పైనో, మావోయిస్టులపైనో నిషేధం విధించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని సీపీఎం పేర్కొన్నది. సమస్య పరిష్కారం కావాలంటే ప్రణాళికబద్ధమైన చర్యలు ఉండాలని అభిప్రాయపడింది. పీఎఫ్ఐ, ఆరెస్సెస్ సభ్యులు కేరళలో మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపించింది. నిషేధం వల్ల వాటి చర్యలు ఆగిపోతాయని భావించటం లేదని పేర్కొన్నది.