భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం ధెంకనాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 53పై ఓ ఆటోను బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక బాలిక, ఆటో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగూర గ్రామానికి చెందిన కుటుంబం ఆటోలో ముక్తపాసి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం మృతుల బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి రోడ్డును క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన లారీ డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.