ముంబై : మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఎడతెరిపి లేకుండా వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల వచ్చిపడడంతో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కింద చిక్కుకున్న మరో ఇద్దరిని రక్షించారు. వర్షాలకు పెద్ద బండరాయి వచ్చి ఇంటిపై పడింది. భవనం వెంటనే కూలిపోగా.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిక్కుకుపోయారు.
ఐదు, 18 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలను రక్షించారు. దంపతులతో పాటు మరో ఇద్దరు ఆడ పిల్లలు, మరో బాలుడు మృతి చెందారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా శివాజీనగర్ ప్రాంతంలో తాత్కాలిక గృహాలు కూలిపోయాయి. ఎవరికీ గాయాలు కానప్పటికీజజ ఈ ప్రాంతంలోని కుటుంబాలను తరలించి సమీపంలో ఉన్న జడ్పీ పాఠశాలలో ఉంచారు. భారీగా కురుస్తున్న వర్షాలతో థానే, పాల్ఘర్ జిల్లాల్లోని వసై, భీవండి, ముర్బాద్ పట్టణాల్లో వంతెనలు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది.