న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారిన సెర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సిద్ధమైంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను గురువారం (సెప్టెంబర్ 1న) లాంచింగ్ చేయనున్నారు. క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ పేరుతో (QHPV) తయారు చేసిన ఈ వ్యాక్సిన్.. సెర్వైకల్ క్యాన్సర్ నివారణకు అద్భుతంగా పనిచేయనుంది.
రేపు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తన చేతుల మీదుగా ఈ కొత్త వ్యాక్సిన్ను లాంచ్ చేయనున్నారు. ఈ నూతన వ్యాక్సిన్ను లాంచ్ చేయనుండటం ఒక ఉత్కంఠపూరితమైన అనుభవమని కొవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా చెప్పారు.
మన బిడ్డలు, మనమరాండ్లు సెర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం చాలా
సంతోషకరమైన విషయమని ఆరోరా వ్యాఖ్యానించారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద 9 నుంచి 14 ఏండ్ల మధ్య వయసు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ 85 నుంచి 90 శాతం కేసులను నివారించగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రభావంతో 30 ఏండ్ల తర్వాత దేశంలో సెర్వైకల్ క్యాన్సర్ కేసులే ఉండవని ఆరోరా చెప్పారు.