టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈ నెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్ అథ్లెట్లు ఉన్నారు. వీళ్లంతా ఢిల్లీ నుంచి చార్టర్డ్ ఎయిరిండియా విమానంలో టోక్యో వెళ్లారు. మొత్తం 88 మంది టీమ్లో 54 మంది అథ్లెట్లు కాగా.. మిగతా వాళ్లంతా సిబ్బంది. జపాన్లోని కురోబి సిటీ ప్రతినిధులు వీళ్లకు ఘన స్వాగతం పలికారు. ఇండియన్ అథ్లెట్లకు మద్దతు తెలుపుతున్న బ్యానర్లు పట్టుకొని వెల్కమ్ చెప్పారు.
ఒలింపిక్స్లో పాల్గొనే అన్ని క్రీడల్లో హాకీ మెన్స్, వుమెన్స్ టీమ్సే పెద్దవి. శనివారం రాత్రి వీళ్లకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెడ్ కార్పెట్ వేసి భారీ ఏర్పాట్ల మధ్య అథ్లెట్లను విమానం ఎక్కించారు. ఈసారి ఒలింపిక్స్ కోసం 228 మంది సభ్యులతో కూడిన ఇండియన్ టీమ్ టోక్యో వెళ్తోంది. అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు.