నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాడు.
ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలతో పాటు రోజు వివిధ భాషల న్యూస్ పేపర్లను ఈ లైబ్రరీలో ఉంచుతాడు. స్థానికులంతా ఈ లైబ్రరీని వాడుకుంటున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుంది ఈ లైబ్రరీకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే చాలా వరకు పుసక్తాలు బూడదైపోయాయి. విషయంతెలుసుకున్నస్థానికులు , పుస్తక ప్రియులు ఇసాక్ కష్టంలో పాలుపంచుకున్నారు. చేయి చేయి కలిపి చందాలు వసూలు చేశారు. మూడు రోజుల్లోనే 20లక్షలు సేకరించారు.
రాజీవ్ నగర్, శాంతి నగర్ స్థానికులకు ఇసాక్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే రోజుకూలీగా జీవనం గడిపే ఇసాక్ తనజీతంలో సగం డబ్బులను లైబ్రరీకే ఖర్చు చేస్తాడు. చిన్నప్పుడు చదువుకోలేకపోయానని అందుకే నలుగురు చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా లైబ్రరీని ఏర్పాటు చేశానంటాడు సయీద్ ఇసాక్.
11వేల పుసక్తాలతో ఉన్న ఈ లైబ్రరీలో 3వేల వరకు భగవద్గీత పుస్తకాలే ఉండటం విశేషం. అంతేకాదు కన్నడ భాష అభివృద్ధి కోసం తనలైబ్రరీలో ఎక్కువగా కన్నడపుస్తకాలను ఉంచాడు.