హైదరాబాద్ : హైదరాబాద్లోని ముషీరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గోదాం యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు గోదాం యజమాని పేర్కొన్నారు. పటాకులు కాల్చడంతో ఆ నిప్పులతో మంటలు వ్యాపించాయా? లేదా విద్యుత్ షాక్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ కల్యాణ్ నగర్ వెంచర్ 3లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మోతీనగర్లోని నోబుల్ అపార్ట్మెంట్పై ఉన్న సెల్ టవర్ కాలిపోయింది. పటాకులు కాల్చడంతో ఆ నిప్పులు ఎగిరి సెల్ టవర్కు అంటుకున్నాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సనత్ నగర్ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.