భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో విద్యుత్ షాక్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారి మంటలు చెలరేగడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో భయాందోళనలకు గురైన రోగులు, సహాయకులు ఆస్పత్రి బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఊపరి పీల్చుకున్నారు.