అగర్తలా: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై త్రిపుర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అభిషేక్తో పాటు దోలా సేన్, బ్రత్య బసు, కునాల్ ఘోష్, సుబాల్ భౌమిక్, శ్రీ ప్రకాశ్ దాస్, ఇతర నేతలపై కేసులు నమోదయ్యాయి. అదనపు ఎస్పీ, ఎస్డీపీఓ ఖోవాయ్తో అనుచితంగా ప్రవర్తించినందుకు, విధులను నిర్వర్తిచకుండా అడ్డుకున్నందున ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ పార్టీ పటిష్టం చేయాలని టీఎంసీ భావించింది.
ఈ క్రమంలో ఇటీవల అభిషేక్ బెనర్జీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో.. ఆయన క్వానయ్పై కొందరు కర్రలు, లాఠీలతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘హోం మంత్రి క్రియాశీలక మద్దతు లేకుండా ఇలాంటి దాడులు జరిగి ఉండేవి కావు. త్రిపుర రాష్ట్ర పోలీసులు ఎదుటే ఈ దాడి జరిగింది. కానీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. ఇలాంటి దాడిని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదు’ అంటూ మమతా బెనర్జీ ఆరోపించారు.