హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి.. పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, మానవాళి సురక్షిత జీవనం గడుపుతుందన్నారు.
ప్రకృతికి, సంగీతానికి విడదీయలేని అనుబంధం ఉందని, ఈ రెండింటితోనే మన జీవితాలు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉంటాయన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ పచ్చదనాన్ని సంతరించుకొని.. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నదన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొని ఎంపీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్కు బహూకరించారు. కార్యక్రమంలో నిర్మాత కొనతం లక్ష్మణ్ పాల్గొన్నారు.