హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీచేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఖాళీలు ఉండకూడదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లో భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం ఖాళీలను 3 క్యాటగిరీలుగా ప్రభుత్వం గుర్తించింది.