కీవ్: యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్పై రష్యా ఫైరింగ్ చేసింది. దీంతో జపోరిజియా ప్లాంట్లో మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఫైటింగ్ ఆగినట్లు ఎనర్గోడర్ మేయర్ డిమిట్రో ఓర్లోవ్ తెలిపారు. జపోరిజియా అణు విద్యుత్తు ప్లాంట్ను ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది స్వాధీనం చేసుకున్నది. ఆ ప్లాంట్లో ఆరు న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. అయితే ఓ ప్లాంట్ వద్ద ఫైరింగ్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీ స్థాయిలో అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. ఒకవేళ అణు ప్లాంట్ పేలితే దాని వల్ల రేడియోషన్ కలిగే ప్రమాదం ఉందని భయాందోళనలు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. రష్యా దళాల కాల్పుల వల్ల జపోరిజియా ప్లాంట్లోని మూడు, నాలుగు, అయిదవ అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్ వద్దకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. 10 ఫైరింజన్లు, 40 మంది ఫైర్ఫైటర్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాంట్ వద్ద అధిక సంఖ్యలో సిబ్బంది గాయపడినట్లు మేయర్ తెలిపారు. వారిని హాస్పిటల్ తరలించే మార్గాలు కూడా లేవన్నారు.
జపోరిజియా పవర్ ప్లాంట్ వద్ద ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొన్నది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.20 నిమిషాలకు మంటల్ని ఆర్పినట్లు ఎమర్జెన్సీ శాఖ తెలిపింది. ఈ ఘటనలో బాధితులు ఎవరూ లేరని ప్రకటించింది. జపోరిజియా ప్లాంట్లో మంటల్ని ఆర్పిన విషయాన్ని ఫైర్ సర్వీసెస్ శాఖ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది.