లక్నో : మరో మహిళతో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భార్యకు రెడ్హ్యాండెడ్గా భర్త దొరికిపోవడంతో అందరి ముందే వారు ఘర్షణకు దిగడంతో పోలీసులు ఎంటరైన ఘటన యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. భార్యాభర్తల గొడవ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీరట్ సెంట్రల్ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అద్నాన్ అనే వ్యక్తి వేరే మహిళతో మార్కెట్కు రాగా ఆయన భార్య ఆయేషా వారిద్దరినీ పసిగట్టింది. దీంతో భార్యాభర్తలు వాదులాడుకుంటుండగా చుట్టూ జనం పోగయ్యారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లోనూ ఆ జంట ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆయేషా గత ఏడాది ఫిబ్రవరిలో అద్నాన్ను పెండ్లి చేసుకుంది. కొద్దికాలంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆయేషాను ఆమె ఇంటి వద్ద అద్నాన్ విడిచిపెట్టాడు. అద్నాన్ మరో మహిళతో మార్కెట్కు వచ్చాడని తెలుసుకున్న అనంతరం ఆమె అక్కడికి చేరుకుంది. వారిని అనుసరించిన ఆయేషా వారిద్దరూ ఓ షోరూంలో ఉండటాన్ని పసిగట్టింది. అక్కడి నుంచి ఆయనను బయటకి తీసుకువచ్చిన తర్వాత ఇద్దరూ రోడ్డు మధ్యలోనే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. గతంలోనూ అద్నాన్ తనను వేధించాడని ఆయేషా ఆరోపించగా, అయితే తాను ఆమెకు విడాకులిచ్చానని అద్నాన్ వాదించాడు. తాను విడాకుల పత్రాలపై సంతకాలు చేయనందున అద్నాన్ను జైలుకు పంపుతానని ఆయేషా పట్టుబట్టారు. మరోవైపు వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ నడుస్తోందని, తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.