Festive Cheers in Stocks | సోమవారం వాల్స్ట్రీట్లో ఓవర్నైట్ ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీసింది. విజయదశమికి ముందు రోజు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1277 పాయింట్లు (2.25%) లాభ పడి 58,065 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 387 (2.29%) పాయింట్ల లబ్ధితో 17,274 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.57 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.273.84 లక్షల వద్ద నిలిచింది. 20211 నుంచి అక్టోబర్ నెలలో రెండు సార్లు మాత్రమే సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. మూడో త్రైమాసికం ప్లస్ ద్వితీయార్థం ప్రారంభం కానున్న నేపథ్యంతోపాటు బుధవారం విజయదశమి సెలవు నేపథ్యంలో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
డోజోన్స్ సోమవారం ట్రేడింగ్లో 2.66 శాతం లాభాలతో ముగిసింది. మూడ నెలల తర్వాత డోజోన్స్ లాభాలతో ముగియడం ఇదే తొలిసారి. పండుగల నేపథ్యంలో జపాన్ నిక్కీతోపాటు ఆసియన్ మార్కెట్లు రెండు వారాల తర్వాత గరిష్ఠస్థాయికి దూసుకెళ్లాయి. చైనా, హాంకాంగ్ స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా ట్రేడింగ్ జరుగలేదు.
సమీప భవిష్యత్లో డాలర్, అమెరికా బాండ్లు పతనం అవుతాయన్న సంకేతాలు మార్కెట్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ 112 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ 0.25% బలపడి రూ.81.67 వద్ద ముగిసింది. యూఎస్ పదేండ్ల గడువు గల బాండ్లు 0.88 శాతం తక్కువ 3619 పాయింట్ల వద్ద ట్రేడయ్యాయి.
గత నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.7000 కోట్లకు పైగా విలువ గల స్టాక్స్ విక్రయించినా.. సోమవారం ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ.590 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. గత నెలలో యూఎస్ మాన్యుఫాక్చరింగ్ డేటా 28 నెలల కనిష్టానికి పడిపోయి 50.9 వద్ద స్థిర పడటం కూడా బుల్ పుంజుకోవడానికి కారణమైనట్లు తెలుస్తున్నది.