ED on Xiaomi | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి గట్టి షాక్ తగిలింది. పన్ను ఎగవేత, రాయల్టీ ఎగవేత తదితర కేసుల్లో షియోమీ ఇండియా నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.5,551.27 కోట్లు జప్తు చేసింది. గత ఏప్రిల్లో ఈ మొత్తం నిధులను ఈడీ జప్తు చేసింది. దీన్ని ఫెమా అథారిటీ శుక్రవారం ధృవీకరించింది. ఈడీ చరిత్రలో ఒక హవాలా లావాదేవీల కేసులో భారీ మొత్తంలో నిధులు జప్తు చేయడం ఇదే తొలిసారి.
రూ.5,551.27 కోట్ల సొమ్మును షియోమీ ఇండియా.. అనధికారికంగా భారత్ ఆవలకు ట్రాన్స్ఫర్ చేసిందని ఫెమా అథారిటీ పేర్కొంది. రాయల్టీ పైసా చెల్లించకుండానే విదేశాలకు విదేశీ మారక ద్రవ్యం అక్రమ మార్గాల్లో బదిలీ చేయడం ఫెమా నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే. 2014 నుంచి భారత్లో స్మార్ట్ ఫోన్ విక్రయాలను ప్రారంభించింది షియోమీ.
షియోమీ ఆ మరుసటి సంవత్సరం 2015 నుంచే విదేశాలకు మనీ పంపడం మొదలు పెట్టింది. షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థతోపాటు మూడు విదేశీ సంస్థలకు రాయల్టీ పేమెంట్స్ రూపంలో డబ్బు ట్రాన్స్ఫర్ ప్రారంభించింది. ఇందులో అమెరికా కేంద్రంగా పని చేస్తున్న రెండు సంస్థలు ఉన్నాయి. ఇలా రాయల్టీ పంపడం వల్ల చైనా కేంద్రంగా పని చేస్తున్న షియోమీ సంస్థకే లబ్ధి చేకూరుతుంది.
తమ నిధులను ఈడీ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ షియోమీ ఇండియా దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టి పారేసింది. ఈడీతో గల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సంబంధిత దర్యాప్తు సంస్థను సంప్రదించాలని షియోమీ ఇండియాకు సూచించింది. ఈడీతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ), ఆదాయం పన్ను శాఖ కూడా షియమో ఇండియాపై చర్యలు తీసుకున్నాయి.