కోడేరు: కొల్లాపూర్లో దారుణం జరిగింది. కన్నతండ్రే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి కుడికిళ్ల గ్రామానికి చెందిన మెట్టే ఓంకార్కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య చనిపోయింది. ఆ తరువాత రెండో భార్యగా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన ఓ యువతిని పెండ్లి చేసుకున్నాడు.
మద్యం మత్తులో నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక కొంతకాలం క్రితం భర్తను వదిలిన ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో స్వగ్రామంలోనే మాచుపల్లి మహేశ్వరి అనే యువతిని ప్రేమించి మరో పెళ్లి చేసుకున్నాడు. వీరికి చందన్(3), విశ్వనాథ్(1) ఇద్దరు పిల్లలు. ఓంకార్ స్థానికంగా మేస్త్రీ పనిచేస్తూ తాగుడుకు బానిసై గ్రామంలో గొడవలకు దిగుతుండేవాడు.
దీంతో అతన్ని శాడిస్ట్గా భావించిన గ్రామస్థులు అతనితో మాట్లాడటం మానేశారు. దీన్ని అవమానంగా భావించిన ఓంకార్.. ఇటీవలే భార్య, ఇద్దరు పిల్లలతో కొల్లాపూర్కు మకాం మార్చి అద్దె ఇంట్లో ఉంటూ భవన నిర్మాణ మేస్త్రీగా పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం నాడు సాయంత్రం భార్య లేని సమయం చూసి లగేజీ బ్యాగ్ తీసుకొని, బైక్ మీద తన ఇద్దరు పిల్లలను ఎక్కించుకొని కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోకి చేరుకున్నారు.
చెట్ల పొదల్లోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒకరి తరువాత ఒకరుగా పిల్లల గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఓంకార్ కూడా గొంతు కోసుకుని చనిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని చుట్టుప్రక్కల పొలాల రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అతన్ని నాగర్ కర్నూలు జిల్లా దవాఖానకు తరలించారు. ఇద్దరు పిల్లలు మరణించగా.. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.