వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 2,35,236 ఎకరాల వివరాలను నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 5,25,017 ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో అత్యధికంగా 2,46,797 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ నెలాఖరు వరకు పంటల నమోదును పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
పరిగి, ఆగస్టు 18 : రైతులు తమ పొలాల్లో ఏ పంటలు సాగు చేశారన్నది పక్కాగా వివరాల సేకరణ కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పంటలు సాగు చేపట్టిన వెనువెంటనే ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణాధికారులు పంటల వివరాల నమోదు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫీడ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 5,25,017 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 53,136 ఎకరాలు, మొక్కజొన్న 57,561., జొన్న 1,721., కందులు 1,41,480., పెసర 10,080., మినుములు 8,227., పత్తి 2,46,797., సోయాబీన్ 1,996., చెరుకు 1,639., వేరుశనగ 343 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేయగా 5,25,017 ఎకరాల్లో సాగు చేశారు.
99 క్లస్టర్లలో పంటల వివరాల నమోదు
వికారాబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో 99 ఏఈవో క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 99 క్లస్టర్లలో ప్రతిరోజూ పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలం ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు నమోదు చేస్తున్నారు. ప్రతి సర్వే నంబర్లోని సబ్ డివిజన్లలో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేసిన వివరాలు పక్కాగా సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను రైతు బంధు ఆన్లైన్ యాప్లో వ్యవసాయ విస్తరణాధికారులు నమోదు చేస్తున్నారు. కొన్ని పంటలకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏఈవోలు రైతు వేదిక వద్దకు వెళ్లి ఫొటో దిగి తమ హాజరుకు సంబంధించి లాగర్ యాప్లో అప్లోడ్ చేసి సంబంధిత రోజు పంటల నమోదు ప్రక్రియ చేపడుతారా, ఇతర ఏ పనులు చేస్తారన్నది కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కేవలం రైతు వేదిక వద్ద దిగిన ఫొటోనే అప్లోడ్ చేయడం ద్వారానే సంబంధిత రోజు విధులకు హాజరైనట్లు గుర్తిస్తారు. అక్కడి నుంచి పంటల నమోదుకు ప్రతి రైతుకు సంబంధించిన పొలం వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,35,236 ఎకరాల పంటల నమోదు
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2,35,236 ఎకరాలకు సంబంధించిన పంటల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు నమోదు చేశారు. ప్రతిరోజూ తమ క్లస్టర్ పరిధిలో పంటలను పరిశీలించి నమోదు ప్రక్రియను మరిం00త వేగంగా, పక్కాగా చేపట్టాలనే ఉద్దేశంతో ప్రతి వారంలో మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తమ పరిధిలోని 2 గ్రామాల్లో, ప్రతి గ్రామంలో 20 మంది రైతులకు సంబంధించిన పొలాలను పరిశీలించి పంటల నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలి. జిల్లా వ్యవసాయాధికారి ప్రతి వారం ఒక గ్రామంలోని 20 మంది రైతులకు సంబంధించిన పొలాలు సందర్శించడంతోపాటు పంటల వివరాల నమోదును ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అందుకనుగుణంగానే జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ పక్కాగా సాగుతుంది. ఇప్పటికే పంటల సాగు పూర్తవడంతో వివరాల సేకరణను మరింత వేగవంతం చేశారు. ఆగస్టు నెలాఖరు వరకు పంటల వివరాల సేకరణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
పూర్తి సమాచారంతో ప్రణాళిక
వానకాలం సీజన్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయి.. వాటి దిగుబడి ఎంత వస్తుందనేది పక్కాగా అంచనా వేసేందుకు ఈ పంటల సాగు వివరాల సేకరణ దోహదపడుతుంది. ఫలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడంతోపాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం, కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ వివరాల సేకరణ దోహదపడుతుంది. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు ఖాళీ బస్తాలు తెప్పించడం వంటివి చేయడానికి ఈ వివరాల సేకరణ చాలా ఉపయోగకరంగా మారుతుంది.
ఈ నెలాఖరు వరకు పూర్తి
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి
జిల్లావ్యాప్తంగా పంటల సాగు వివరాల సేకరణ కొనసాగుతున్నది. జిల్లాలో ఈ వానకాలంలో 5,25,017 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 2,35,236 ఎకరాలకు సంబంధించిన పంటల వివరాల సేకరణ పూర్తయింది. జిల్లాలోని 99 క్లస్టర్లలో పంటల వివరాల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ నెలాఖరు వరకు పంటల వివరాల నమోదు పూర్తి చేయాలని నిర్దేశించాం.