న్యూఢిల్లీ : ఈ నెల 22న పార్లమెంట్ వెలుపల శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి ఆగస్ట్ 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రాకేశ్ తికాయిత్ మాట్లాడుతూ రిపబ్లిక్ దినోత్సవం రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగినా.. ప్రస్తుతం శాంతియుతంగా పార్లమెంట్ వెలువల నిరసనకు కూర్చుంటామన్నారు. లోపల సభ కొనసాగుతుందన్నారు. 200 మంది రైతులు బస్సులో పార్లమెంట్కు వెళ్తారని, ఛార్జీలను సైతం తామే చెల్లిస్తామన్నారు. గతేడాది అమలులోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానికి సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి రాలేదు.