న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఆరు నెలలకు చేరగా.. బుధవారం బ్లాక్ డే జరుపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వేళ ప్రోటోకాల్స్ మేరకు నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చాలా మంది రైతులు శిబిరాలకు వచ్చారని, అలాగే ప్రజలు తమకు వీలైన చోట నల్ల జెండాలు ఎగుర వేస్తున్నారన్నారు. రైతులు నిరసన చేపట్టి ఆరు నెలలైందని, కేంద్రం తమ మాట వినకపోవడంతో రైతులు నల్లజెండాలు ఎగుర వేసి నిరసన తెలుపుతున్నారన్నారు. చట్టాల రద్దు చేసే వరకు రైతు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయమై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.